నా భార్యకు అనారోగ్యం.. కుమారుడు విదేశాల్లో.. బెయిలివ్వాలని సిసోదియా వినతి

దిల్లీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కోర్టుకు తెలిపారు.

Updated : 22 Mar 2023 04:55 IST

  

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా కోర్టుకు తెలిపారు. తనకు బెయిలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలోని రౌస్‌ ఎవెన్యూలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన తరఫు న్యాయవాది మంగళవారం ఈ మేరకు వాదనలు వినిపించారు. ‘సిసోదియా ప్రజాసేవకుడు. ఆయన విదేశాలకు పారిపోయే ముప్పు లేదు కనుక కస్టడీలో ఉంచనవసరంలేదు. మద్యం విధానంలో మార్పులు చేసేందుకు ఆయన ముడుపులు స్వీకరించినట్లు నిరూపించే ఆధారాలేవీ లభించలేదు. ఆయన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుమారుడు విదేశాల్లో ఉండటంతో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత సిసోదియాపైనే ఉన్నందున బెయిలు మంజూరు చేయండి’ అంటూ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోదియా అమాయకుడేమీ కాదని పేర్కొంది. దిల్లీ ప్రభుత్వంలో 18 శాఖల బాధ్యతలను ఆయన నిర్వర్తించారని గుర్తుచేసింది. ఆయన బయటికొస్తే సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రమాదముందని పేర్కొంది. తదుపరి విచారణ మార్చి 24కు వాయిదా పడింది.


ఈడీ కేసులోనూ బెయిలు కోసం దరఖాస్తు

దిల్లీ మద్యం విధానానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న నగదు అక్రమ చలామణి కేసులోనూ బెయిలు కోసం కోర్టును సిసోదియా ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 25లోగా స్పందన తెలపాలని ఈడీని న్యాయస్థానం ఆదేశించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని