నిజ్జర్‌ హత్య దర్యాప్తును తారుమారు చేస్తున్నారు

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్‌ అధికారి దెబ్బతీశాడని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు.

Published : 06 Nov 2023 04:50 IST

భారత్‌ రాయబారి సంజయ్‌ వర్మ ఆరోపణ..

ఒట్టావా: ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే ఓ కెనడా సీనియర్‌ అధికారి దెబ్బతీశాడని భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ అనే పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలను బలపర్చే ఆధారాలుంటే సమర్పించాలని వర్మ డిమాండ్‌ చేశారు. నిజ్జర్‌ హత్య తర్వాత కెనడా పోలీసులు చేపట్టిన దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో వారికి భారత్‌ సహకరించడానికి అవసరమైన ఆధారాలను మాత్రం ఇప్పటివరకు సమర్పించలేదన్నారు. ‘‘ఆధారాలు ఎక్కడున్నాయి..? దర్యాప్తులో ఏమి తేలింది..? నేను ఒక అడుగు ముందుకేసి చెబుతున్నాను.. కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత్‌.. ఆ దేశ ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయి’’ అని వర్మ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని