గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి

అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు  ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 07 Nov 2023 06:35 IST

వివాదం సుప్రీంకోర్టుకు రాకముందే బిల్లులపై చర్యలకు ఉపక్రమించాలి
పంజాబ్‌ ప్రభుత్వ వ్యాజ్యంపై సీజేఐ ధర్మాసనం వ్యాఖ్య

దిల్లీ: అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు  ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు తమ పనితీరుపై చిన్నపాటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని అభిప్రాయపడింది. బిల్లుల ఆమోదం వివాదాలు సుప్రీంకోర్టుకు చేరక ముందే వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికింది. పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ చర్యల తాజా పరిస్థితిని వివరిస్తూ నివేదిక సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం...‘ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం కాదనే వాస్తవాన్ని గవర్నర్లు విస్మరించరాదు’ అని హితవు పలికింది. పంజాబ్‌ ప్రభుత్వం తన ముందుంచిన బిల్లులు అన్నింటిపై గవర్నర్‌ చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత వ్యాజ్యం అవసరంలేదని తుషార్‌ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ‘విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు మాత్రమే చర్యలు తీసుకోవడానికి ముగింపు పలకాలి’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది. బడ్జెట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత పంజాబ్‌ ప్రభుత్వం అసెంబ్లీని మళ్లీ సమావేశపర్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. మూడు బిల్లుల విషయమై పంజాబ్‌ ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం తలెత్తింది. ఆప్‌ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని