కౌన్‌బనేగా కరోడ్‌పతిలో రూ.కోటి గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు

బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ)లో 14 ఏళ్ల బాలుడు ఏకంగా రూ.కోటి గెలుచుకొని రికార్డు సృష్టించాడు.

Published : 30 Nov 2023 04:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ)లో 14 ఏళ్ల బాలుడు ఏకంగా రూ.కోటి గెలుచుకొని రికార్డు సృష్టించాడు. కేబీసీ జూనియర్స్‌ స్పెషల్‌లో భాగంగా హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి మయంక్‌ మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ.కోటి సొంతం చేసుకున్నాడు. షో మొదలయ్యాక మయంక్‌ ఒక్క లైఫ్‌లైన్‌ కూడా వాడకుండా రూ.3.2 లక్షల వరకూ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. రూ.12.5 లక్షల ప్రశ్నకు ఒక లైఫ్‌లైన్‌ వాడుకున్నాడు. రూ.కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన తర్వాత మయంక్‌ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ‘‘కొత్తగా కనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి, దాని మ్యాప్‌ను తయారుచేసిన యూరోపియన్‌ క్యాట్రోగ్రాఫర్‌ ఎవరు?’’ అని ప్రశ్నించిన అమితాబ్‌ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. మయంక్‌.. ‘మార్టిన్‌ వాల్డ్‌సీముల్లర్‌’ అంటూ సరైన ఆప్షన్‌ ఎంచుకొని రూ.కోటి సొంతం చేసుకున్న తొలి జూనియర్‌ కంటెస్టెంటుగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని