చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కలకలం.. భారత్‌లో 6 రాష్ట్రాలు అప్రమత్తం

చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Updated : 30 Nov 2023 06:22 IST

దిల్లీ: చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజా పరిస్థితిపై భారత ప్రభుత్వం స్పందిస్తూ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. మానవ వనరులు, ఆస్పత్రుల్లో పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. సీజనల్‌ ఫ్లూ పట్ల ప్రజలంతా జాగరూకతతో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తర్‌కాశీ, పిఠోర్‌గఢ్‌ జిల్లాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ సమీక్షించాలని ఆరోగ్య శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అసాధారణ శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితే ఆ సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని హరియాణా ఆరోగ్యశాఖ ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశించింది. తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలు కూడా ఫ్లూ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించాయి. చైనాలో గత కొన్ని రోజులుగా నిమోనియా వ్యాప్తి తీవ్రంగా ఉంది. అయితే, అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని, ఈ కేసుల్లో కొత్త వైరస్‌లను గుర్తించలేదని ఆ దేశం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని