బాధితుణ్ని నిందితుడిగా మార్చే కుట్ర

బాధితుడినైన తనపై కల్పిత అభియోగాలు మోపి నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 Dec 2023 03:52 IST

లోక్‌సభ స్పీకర్‌కు బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీ లేఖ

దిల్లీ: బాధితుడినైన తనపై కల్పిత అభియోగాలు మోపి నిందితుడిగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ రమేశ్‌ బిధురిపై ఫిర్యాదు ఇచ్చినందుకు ప్రతిగా ఈ కుట్ర పన్నుతున్నారని స్పీకర్‌ ఓం బిర్లాకు రాసిన లేఖలో అలీ పేర్కొన్నారు.బిధురిపై తానిచ్చిన ఫిర్యాదును భాజపా ఎంపీని రెచ్చగొట్టానన్న అభియోగంతో జత చేయడం నిర్ఘాంతపరిచిందని తెలిపారు. బాధితుణ్నే నిందితుడిగా మార్చేందుకు ప్రయత్నించడం విచారకరమన్నారు. సభలో తనను దూషించిన రమేశ్‌ బిధురిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు దానీశ్‌ అలీ ఆ లేఖలో రాశారు. దీని ప్రతిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బిధురి, అలీ ఫిర్యాదులపై లోక్‌సభ సభా హక్కుల కమిటీ ఈ నెల 7న విచారణ జరపనుంది. వేర్వేరు సమయాల్లో కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా వారిద్దరికీ నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా భాజపా ఎంపీ రమేశ్‌ బిధురి బీఎస్పీ ఎంపీ దానీశ్‌ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని