కళాశాలల్లో సెల్ఫీ పాయింట్లు

వివిధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది.

Published : 02 Dec 2023 04:27 IST

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌

దిల్లీ: వివిధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాలపై యువతలో అవగాహన పెంచడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కీలక ప్రకటన చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆవరణల్లోని వ్యూహాత్మక ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ పాయింట్లు కేంద్ర విద్యాశాఖ షేర్‌ చేసిన 3డీ లేఅవుట్ల డిజైన్లకు అనుగుణంగా ఉండేలా చూడాలని కోరింది. దేశానికి గర్వకారణమైన అంశాలతోపాటు ప్రపంచ వేదికపై భారత ప్రగతిని చాటిన పలు కార్యక్రమాలపై ప్రతి పౌరుడికీ అవగాహన కల్పించేలా ఇవి ఉండాలని యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి తెలిపారు. విద్యార్థులు, సందర్శకులు ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫొటోలు తీసుకొని ఆ ప్రత్యేక క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సెల్ఫీ పాయింట్లను ‘ఏక్‌ భారత్‌ - శ్రేష్ఠ్‌ భారత్‌’, ‘జాతీయ విద్యావిధానం-2020’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల ఇతివృత్తాన్ని, వాటిలోని కీలక అంశాలను నొక్కి చెప్పేలా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. తద్వారా విభిన్న రంగాల్లో భారత్‌ సాధించిన అభివృద్ధిని యువత స్ఫూర్తిగా తీసుకొనే అవకాశం ఉంటుందని మనీశ్‌ జోషి పేర్కొన్నారు. ఈ సెల్ఫీ పాయింట్లు విద్యార్థులకు గర్వకారణంగానే కాకుండా భావితరాలకు స్ఫూర్తినిచ్చే శక్తిశీల, ఆకర్షణీయ ప్రదేశాలుగా నిలుస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని