వెడ్‌ ఇన్‌ ఇండియా.. మీరే ప్రారంభించాలి

భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని సూచించారు.

Updated : 09 Dec 2023 05:29 IST

పారిశ్రామిక కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన
దేశ ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తుందని వ్యాఖ్య

దేహ్రాదూన్‌: భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ కీలక సూచన చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్నులైన పారిశ్రామిక కుటుంబాలవారు ప్రారంభించాలని కోరారు. ఉత్తరాఖండ్‌లో శుక్రవారం పెట్టుబడిదారుల సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మేకిన్‌ ఇండియా తరహాలో దేశంలో ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ ప్రారంభం కావాలి. పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని భారత్‌లో విశ్వసిస్తారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు తమ ఇంట్లో జరిగే ఒక వివాహానికైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు దేవభూమిగా పేర్కొనే ఉత్తరాఖండ్‌ను వేదికగా ఎంచుకోవాలి. ఇదే తరహాలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలం చేకూరుతుంది. స్థానిక ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.

‘మూడోసారి ప్రధాని పదవిని చేపడతా’

ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించి మూడో సారి ప్రధాని పదవి చేపడతానని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను మూడో సారి ప్రధాని పదవి చేపట్టాక.. రాబోయే కొన్నేళ్లలో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుతం దేశంలో విధానపరమైన పాలనను మీరు చూస్తున్నారు. భారత్‌ ఆకాంక్షలు నెరవేరాలంటే.. సుస్థిర ప్రభుత్వం అవసరం. దేశంలో రాజకీయ స్థిరత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

‘ప్రతి రూపాయి వసూలు చేస్తాం’

ప్రజల నుంచి  ప్రతిపక్ష నేతలు దోచిన ప్రతి రూపాయి వెనక్కు రావాల్సిందేనని ఇది ‘మోదీ హామీ’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. అలాగే ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహుతో సంబంధం ఉందన్న ఓ వ్యాపార సంస్థకు చెందిన వివిధ కార్యాలయాల నుంచి రూ.200 కోట్లను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కథనాన్ని మోదీ తన పోస్టుకు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని