ఇక చూసి రాసే పరీక్షలు

పుస్తకాలు చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు.

Published : 23 Feb 2024 06:56 IST

ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్న సీబీఎస్‌ఈ

దిల్లీ: పుస్తకాలు చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు మాత్రం ఈ ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని వివరించారు. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో ఆంగ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టుల్లో; అదేవిధంగా 11, 12 తరగతుల్లో ఆంగ్లం, గణితం, జీవశాస్త్ర సబ్జెక్టుల్లో ఓపెన్‌ బుక్‌ పరీక్షలను ప్రవేశపెట్టాలని సీబీఎస్‌ఈ యోచిస్తోంది. ఈ పద్ధతిలో విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందో గమనిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఓపెన్‌ బుక్‌ పద్ధతిలో విద్యార్థులు పాఠ్య గ్రంథాలను, అధ్యయన సామగ్రినీ వెంట తీసుకుపోవచ్చు. వాటిని చూస్తూ పరీక్ష రాయవచ్చు. దీనివల్ల విద్యార్థుల సృజనాత్మకత, సమస్యా పరిష్కార శక్తి, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేస్తారు. 2014 నుంచి 2017 వరకు ఓపెన్‌ బుక్‌ పద్ధతితో ప్రయోగాలు చేసినా వాటిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్‌డ్‌ ప్లేస్‌మెంట్‌ (ఏపీ) పరీక్షలు రాయాలి. ఆ పరీక్షా పత్రాల్లో ఇచ్చే ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏపీ ప్రశ్నలను పరిశీలించి ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతి ప్రవేశపెట్టాలని దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జ్యోతి శర్మ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని