పథకాల అమలుపై ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవు

ప్రభుత్వాల విధానపరమైన అంశాలను సమీక్షించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Published : 24 Feb 2024 03:35 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: ప్రభుత్వాల విధానపరమైన అంశాలను సమీక్షించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఏదైనా ఒక పథకం మంచిదని గాని, ఇంకా మెరుగైనదని గానీ ప్రభుత్వాలకు సూచించలేవని స్పష్టం చేసింది. చిన్నారులకు ఆహార కొరతను, పోషకాహార లోపాన్ని తీర్చడానికి సామాజిక వంటశాలలు (కమ్యూనిటీ కిచెన్స్‌) ఏర్పాటు చేసేలా ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయని ఈ విషయంలో న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ప్రభుత్వ విధానాల చట్టబద్ధతను సమీక్షించడం కోర్టుల పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కుతో సహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు అనున్‌ ధావన్‌, ఇషాన్‌ సింగ్‌, కునాజన్‌ సింగ్‌ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని