అంతరిక్షంలోకి భారత దూతలు వీరే..!

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Updated : 28 Feb 2024 05:50 IST

‘గగన్‌యాన్‌’ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ
ఈసారి కౌంట్‌డౌన్‌, రాకెట్‌ మనవే
140 కోట్ల మంది ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళతారు: ప్రధాని

తిరువనంతపురం: భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వైమానిక దళానికి చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్‌ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా.. రోదసిలోకి వెళ్లనున్నారు. భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో  మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వారికి ‘ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌’ అమర్చారు. ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కారని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్లే ‘నాలుగు శక్తులు’ అని కొనియాడారు. నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని తెలిపారు. ‘‘ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే.. టైమింగ్‌ మనదే.. రాకెట్‌ మనదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేశ్‌ శర్మ 1984లో రికార్డు సృష్టించారు. అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు.

స్వయం సమృద్ధికి తార్కాణం

గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ భాగాలను భారత్‌లోనే తయారుచేయడం.. అంతరిక్ష రంగంలో దేశ స్వయంసమృద్ధికి నిదర్శనమని మోదీ తెలిపారు. ‘‘శిక్షణ సమయంలో వ్యోమగాములు ఎంతో అంకితభావం ప్రదర్శించారు. యోగానూ అభ్యసించారు. సవాళ్లను అధిగమించే సత్తా, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమైన భారతీయ ‘అమృత్‌ తరానికి’ వీరు ప్రతినిధులు. అంతరిక్ష రంగంలో మన విజయాలు.. యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంచుతున్నాయి. 21వ శతాబ్దంలో అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు మన దేశానికి ఊతమిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘చందమామ నుంచి నమూనాలను తెచ్చేందుకు మళ్లీ వ్యోమనౌకను పంపుతాం. 2035 నాటికి రోదసిలో మన అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుంది. చందమామపైకి మన రాకెట్‌లో వ్యోమగామిని పంపుతాం’’ అని తెలిపారు. ఈ రంగంలో భారత నారీశక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమని తెలిపారు.
అంతకుముందు ప్రధాని.. తిరువనంతపురం నుంచి అంతరిక్ష రంగానికి సంబంధించిన రూ.1,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు. అందులో శ్రీహరికోటలోని పీఎస్‌ఎల్‌వీ అనుసంధాన కేంద్రం, తమిళనాడులోని మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజిన్‌ అండ్‌ స్టేజ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ, తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ట్రైసోనిక్‌ విండ్‌ టన్నెల్‌ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏమిటీ గగన్‌యాన్‌?

గగన్‌యాన్‌ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్రజలాల్లో ల్యాండ్‌ అవుతుంది. శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం, సాంకేతిక విభాగాల్లో వ్యోమగాములు పట్టు సాధించారు. ఈ యాత్ర విజయవంతమైతే మానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ చేరుతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.

అద్భుత ప్రతిభావంతులు..

భారత తొలి అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు.. యుద్ధవిమాన పైలట్లుగా వాయుసేనలో అద్భుత ప్రతిభను చాటారు. వారికి 2 వేల నుంచి 3 వేల గంటల గగనవిహార అనుభవం ఉంది. నలుగురూ పుణెకు సమీపంలోని ఖడక్‌వాస్లాలో ఉన్న ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)కి ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకొని, పైలట్‌ ట్రైనింగ్‌ కోసం హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి వెళ్లారు. అగ్రశ్రేణి యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30ఎంకేఐ, మిగ్‌-29, మిగ్‌-21, జాగ్వార్‌, డోర్నియర్‌, హాక్‌ జెట్‌లతోపాటు డోర్నియర్‌, ఏఎన్‌-32 వంటి రవాణా విమానాలను నడిపిన అనుభవం వీరి సొంతం. ఈ నలుగురు.. 13 నెలల పాటు రష్యాలో వ్యోమగామి శిక్షణ పొందారు. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది.

ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌: 1976లో కేరళలో జన్మించారు. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి.. ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ దక్కించుకున్నారు. 1998 డిసెంబరులో వాయుసేనలో ఫైటర్‌ పైలట్‌గా చేరారు. 3వేల గంటల ఫ్లయింగ్‌ అనుభవాన్ని సాధించారు. ‘కేటగిరీ-ఏ’ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను పొందారు. అమెరికాలోని యూఎస్‌ స్టాఫ్‌ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు.

అజిత్‌ కృష్ణన్‌: 1982లో చెన్నైలో జన్మించారు. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పతకం, స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ గెల్చుకున్నారు. శిక్షణ అనంతరం 2003 జూన్‌లో వాయుసేనలో ఫైటర్‌ పైలట్‌గా చేరారు. యుద్ధవిమానాల చోదకుడిగా 2,900 గంటల గగనవిహార అనుభవాన్ని గడించారు. ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ హోదాను సాధించారు.

అంగద్‌ ప్రతాప్‌: 1982లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. 2004 డిసెంబరులో ఫైటర్‌ పైలట్‌గా వాయుసేనలోకి ప్రవేశించారు. దాదాపు 2వేల గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఆయన సొంతం.

శుభాన్షు శుక్లా: 1985లో యూపీలోని లఖ్‌నవూలో జన్మించారు. 2006 జూన్‌లో ఫైటర్‌ విమానాల పైలట్‌గా చేరారు. దాదాపు 2వేల గంటల గగనవిహార అనుభవం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు