గుజరాత్‌ తీరంలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

అరేబియా సముద్రంలో భారత నౌకాదళం బుధవారం భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

Published : 29 Feb 2024 05:13 IST

వాటి విలువ రూ.1,300 కోట్ల పైమాటే
అయిదుగురు విదేశీయుల అరెస్ట్‌

పోర్‌బందర్‌/దిల్లీ: అరేబియా సముద్రంలో భారత నౌకాదళం బుధవారం భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), గుజరాత్‌ పోలీసులతో కలిసి ఈ సంయుక్త ఆపరేషను నిర్వహించింది. ఇరాన్‌ ఓడరేవు నుంచి వచ్చిన చేపల పడవను గుజరాత్‌లోని పోర్‌బందర్‌ తీరంలో అడ్డుకొని 3,300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్‌ విలువ రూ.1,300 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల దాకా ఉంటుందని ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌ దిల్లీలో మీడియాకు తెలిపారు. సముద్రతీరాన ఇంత భారీస్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారని  వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు రేఖ వద్ద మంగళవారం భారత జలాల్లోకి ప్రవేశించిన చిన్నపాటి నౌకను గుర్తించిన అధికారులు వెంటనే దానిని ముట్టడించారు. అందులో ఉన్న 3,110 కిలోల చరస్‌, 158 కిలోల మెథామెఫ్తమైన్‌, 25 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్యాకెట్లపై పాకిస్థాన్‌ ఆహార కంపెనీ ముద్ర ఉంది. నౌకలోని అయిదుగురు విదేశీయుల్ని అరెస్టు చేశారు.  గతేడాది మే నెల కేరళ తీరంలో 2,500 కిలోల డ్రగ్స్‌ పట్టుబడిన సంగతి తెలిసిందే.

  సముద్రంలో భారీస్థాయిలో డ్రగ్స్‌ సీజ్‌ చేసి ఏజెన్సీలు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని