పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోతే.. మోసం కాదు: సుప్రీంకోర్టు

వివాహ ప్రతిపాదన మొదలై అది కార్యరూపం దాల్చకపోతే.. దానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Updated : 29 Feb 2024 07:43 IST

దిల్లీ: వివాహ ప్రతిపాదన మొదలై అది కార్యరూపం దాల్చకపోతే.. దానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఓ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించి కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన ఛీటింగు కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఆరోపణ కింద నేరం రుజువు చేయాలంటే.. మోసం చేయాలనే ఉద్దేశం మొదటినుంచీ ఉండాలనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం పదే పదే చెబుతోందని గుర్తు చేసింది. తనను పెళ్లి చేసుకోకుండా రాజు అనే వ్యక్తి మోసం చేశాడంటూ కర్ణాటకకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత తామిద్దరం ఫోనులో మాట్లాడుకున్నామని.. కల్యాణమండపం కోసం తన తండ్రి రూ.75 వేలు అడ్వాన్సు ఇచ్చారని.. చివరకు రాజు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. రాజుతోపాటు ఆయన సోదరులు, సోదరి, తల్లి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. సెక్షన్‌ 417 కింద నమోదైన ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు.. కేవలం రాజును దోషిగా తేల్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజు 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారించిన జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ ప్రసన్నా బి.వరాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఒక నిర్దిష్ట సందర్భంలో మోసం ఉండవచ్చని.. ఇటువంటి కేసుల్లో నేర నిరూపణకు విశ్వసనీయ సాక్ష్యాలు ఉండాలని పేర్కొంది. ఈ కేసులో యువతిని మోసం చేసే ఉద్దేశం అతడికి ఉన్నట్లు కనిపించడం లేదని, అందుకే సెక్షన్‌ 417 కింద దీన్ని నేరంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని