ఇళ్లలో సౌర వెలుగులకు రూ.75,000 కోట్లు

ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ.78వేలు రాయితీగా ఇవ్వనుంది.

Published : 01 Mar 2024 05:12 IST

‘సూర్య ఘర్‌’ కింద ఒక్కో నివాసానికి రూ.78వేల వరకు రాయితీ
తక్కువ వడ్డీకి రుణంగా యూనిట్‌ వ్యయం
ఎరువుల రాయితీకి రూ.24,420 కోట్లు
కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు

ఈనాడు, దిల్లీ: ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి గరిష్ఠంగా రూ.78వేలు రాయితీగా ఇవ్వనుంది. 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి రూ.75,021 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ‘పీఎం-సూర్యఘర్‌: ఉచిత విద్యుత్తు పథకం’ పేరుతో అమలుచేసే పథకానికి రాయితీని రెండు భాగాలుగా విభజించి ఇవ్వనుంది. 2 కిలోవాట్ల సామర్థ్యానికి 60%, అంతకు పైబడిన యూనిట్లకు 40% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి రూ.1.45 లక్షలు ఖర్చయితే అందులో కేంద్రం గరిష్ఠంగా రూ.78వేలు అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం లేని బ్యాంకు రుణం రూపంలో సమకూరుస్తుంది. రెపోరేట్‌కు అదనంగా 0.5% వడ్డీని దానిపై వసూలు చేయనుంది. ప్రస్తుతం ఇది 7% ఉంది.

ఏడేళ్లలో తీరనున్న రుణం

ఉత్పత్తి అయ్యే దాంట్లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకోవచ్చు. మిగిలిన 600 యూనిట్లను నెట్‌ మీటరింగ్‌ ద్వారా విక్రయించుకోవచ్చు. దీనివల్ల నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకుంటారు. దీనివల్ల ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. కేబినెట్‌ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.60వేలు, 3 కి.వా. ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.78వేలు గరిష్ఠ రాయితీ అందుతుందని చెప్పారు. ‘ఇంటి యజమానులు నేషనల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సౌర ఫలకాలు, ఇతర వస్తువులు విక్రయించే గుర్తింపు పొందిన విక్రేతల జాబితా దానిలోనే ఉంటుంది. లబ్ధిదారులు వారి ద్వారా వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సౌర వ్యవస్థను ఏర్పాటుచేశాక సంబంధిత డిస్కంలు ‘నెట్‌ మీటరింగ్‌’ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. ఈ రెండూ పూర్తయిన వెంటనే కేంద్రం రాయితీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తుంది. కోటి ఇళ్లపై ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంవల్ల దేశంలో కొత్తగా 30 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అందుబాటులోకి వస్తుంది. 25 ఏళ్లలో 72 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి’ అని వివరించారు.

ఉమ్మడిగానూ ఏర్పాటు చేసుకోవచ్చు

నివాసుల సంక్షేమ సంఘాలు, బృందంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు ఉమ్మడి ప్రాంతంలోని విద్యుద్దీపాలు, వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల కోసం 500 కి.వా. వరకు రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చని ఠాకుర్‌ చెప్పారు. ఇందుకోసం ఒక్కో కిలోవాట్‌కు రూ.18వేల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఒక సౌర నమూనా గ్రామాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో బాగా పనిచేసే పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 2025 కల్లా దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైనా రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థ ఏర్పాటుచేస్తామని, రాయితీ మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే ఇస్తుందని తెలిపారు. ఈ పథకం వల్ల 17 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.

ఎరువుల ధరలో మార్పు ఉండదు

ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే ఖరీఫ్‌ సీజన్‌లో పోషకాధారిత ఎరువుల రాయితీ కోసం రూ.24,420 కోట్లు కేటాయించడానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఫాస్ఫరస్‌, పొటాషియంలతో కూడిన ఎరువులు గత ఏడాది ధరకే ఈ ఏడాదీ లభ్యమవుతాయని మంత్రి తెలిపారు.

  • పులులు, సింహాలు, చిరుతలు వంటివాటి పరిరక్షణకు ‘ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయెన్స్‌’ (ఐబీసీఏ) ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీని ప్రధాన కార్యాలయం మనదేశంలో ఉంటుంది. కేంద్రం ఏకమొత్తంగా రూ.150 కోట్లు సమకూరుస్తుంది.
  • 12 సంక్లిష్ట, వ్యూహాత్మక ఖనిజాల మైనింగ్‌ రాయల్టీ రేట్లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందులో బెరీలియం, కాడ్మియం, కోబాల్ట్‌, టైటానియం, టంగ్‌స్టన్‌, వనాడియం వంటివి ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని