నెట్‌ మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు: యూజీసీ

వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది.

Published : 29 Mar 2024 04:42 IST

దిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్‌ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. ఇందుకోసం విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటిదాకా నిర్వహిస్తూ వచ్చిన ప్రత్యేక ప్రవేశపరీక్షల అవసరం ఇకపై ఉండదు. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో రెండుసార్లు నెట్‌ నిర్వహిస్తారు. ఇందులో సాధించే మార్కులు ప్రస్తుతం జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)కు, మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకాలకు అర్హతగా పరిగణిస్తున్నారు. ఈ పరీక్ష నిబంధనల సమీక్షకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సూచనల మేరకు 2024-25 విద్యాసంవత్సరం నుంచీ నెట్‌  మార్కులను పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హతగా తీసుకోవాలని నిర్ణయించినట్లు యూజీసీ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థులకు వివిధ పరీక్షల శ్రమను, ఖర్చుల భారాన్ని తగ్గిస్తుందని యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ చెప్పారు. జూన్‌ నెలలో నిర్వహించనున్న యూజీసీ నెట్‌ నమోదు ప్రక్రియ వచ్చే వారం ప్రారంభమయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని