రైలు ప్రయాణికుడి సెల్ఫీతో.. డెత్‌ మిస్టరీ ఛేదించిన పోలీసులు

మహారాష్ట్రలోని కల్యాణ్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోను అపహరించేందుకు దొంగ ప్రయత్నించాడు.

Published : 30 Mar 2024 05:47 IST

ముంబయి: మహారాష్ట్రలోని కల్యాణ్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోను అపహరించేందుకు దొంగ ప్రయత్నించాడు. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి హత్యకేసు కింద అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జాహిద్‌ జైదీ రైలులో సెల్ఫీ వీడియో తీసుకొంటూ ఉండగా.. ఓ దొంగ ఫోను అపహరించే ప్రయత్నం చేశాడు. జాహిద్‌ వెంటనే అప్రమత్తం కావడంతో దొంగ పారిపోయాడు. ఈ తతంగమంతా సెల్ఫీ వీడియోలో రికార్డ్‌ అయింది. వైరల్‌గా మారిన ఈ వీడియో కల్యాణ్‌ రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లి నిందితుణ్ని అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న ఫోను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. ఇటీవల చోటుచేసుకున్న అనుమానాస్పద మృతికి అసలు కారణం తెలిసింది. ‘‘నిందితుణ్ని ఠాణెకు చెందిన జాదవ్‌గా గుర్తించాం. అతడి వద్ద ఉన్న మొబైల్‌ను స్విచ్చాన్‌ చేసి.. అది పుణెకు చెందిన ప్రభాస్‌ భాంగేకు చెందినదిగా గుర్తించాం. బ్యాంకు ఉద్యోగి అయిన ప్రభాస్‌ హోలీ కోసం పుణె నుంచి కల్యాణ్‌లోని తన ఇంటికి వచ్చాడు. అనంతరం మార్చి 25 అర్ధరాత్రి పుణెకు తిరిగివెళుతూ విఠల్‌వాడి రైల్వేస్టేషనులో రైలు నుంచి పడి మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా భావించాం. ప్రభాస్‌ ఫోన్‌ను జాదవే దొంగిలించాడు. ఆ ఫోను తిరిగి లాక్కోడానికి చేసిన ప్రయత్నంలో కదులుతున్న రైలులోంచి కిందపడి ప్రభాస్‌ మరణించాడు’’ అని పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని