ఆడ్వాణీతో పార్లమెంటరీ సంప్రదాయాలు ఇనుమడించాయి: రాష్ట్రపతి భవన్‌

భాజపా సీనియర్‌ నేత ఆడ్వాణీ కాకలుతీరిన రాజకీయ దిగ్గజమని రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. రాజకీయాల్లో ఏడు దశాబ్దాలకుపైగా ఆయన కీలక సేవలందించారని తెలిపింది.

Published : 01 Apr 2024 05:26 IST

దిల్లీ: భాజపా సీనియర్‌ నేత ఆడ్వాణీ కాకలుతీరిన రాజకీయ దిగ్గజమని రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. రాజకీయాల్లో ఏడు దశాబ్దాలకుపైగా ఆయన కీలక సేవలందించారని తెలిపింది. పార్లమెంటేరియన్‌గా చర్చలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యంతో పార్లమెంటరీ సంప్రదాయాలు ఇనుమడించాయని రాష్ట్రపతి భవన్‌ ‘ఎక్స్‌’లో శ్లాఘించింది. ‘‘కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన ఉన్నప్పుడు దేశ ప్రయోజనాలకే అన్నింటికంటే ప్రాధాన్యమిచ్చేవారు. దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దీర్ఘకాలంపాటు అలుపెరగకుండా ఆయన సాగించిన పోరు.. అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణంతో కొలిక్కి వచ్చినట్లయింది. దేశానికి ఒక ఎజెండాను రూపుదిద్దడానికి కృషిచేసిన కొద్దిమంది నేతల్లో ఆయనొకరు’’ అని వరస పోస్ట్‌లలో పేర్కొంది. ఈ ఏడాది భారతరత్న పురస్కారాన్ని నలుగురికి మరణానంతరం ప్రకటించగా వారి తరఫున కుటుంబ సభ్యులు శనివారం రాష్ట్రపతిభవన్‌లో వాటిని స్వీకరించిన విషయం తెలిసిందే. అయిదో వ్యక్తి ఆడ్వాణీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాష్ట్రపతే స్వయంగా వెళ్లి అందించారు. ఆడ్వాణీ 2019 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని