బాండ్లలో లోపాలు సరిదిద్దవచ్చు: మోదీ

ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు ఎవరికి ఇస్తున్నారో తెలుస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 01 Apr 2024 05:32 IST

ఈ వ్యవస్థ వల్ల వివరాలు తెలుస్తున్నాయి
ఏదీ లోపరహితం కాదన్న ప్రధాని

దిల్లీ: ఎన్నికల బాండ్ల వ్యవస్థ ఉండడం వల్ల విరాళాలను ఎవరు ఎవరికి ఇస్తున్నారో తెలుస్తోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయని, వాటిని మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. ‘‘ఏ వ్యవస్థా లోపరహితం కాదు. బాండ్ల విషయంలో ఎదురుదెబ్బ తిన్నామని చెప్పేలా మేం ఏం చేశామో చెప్పండి. ఈ వ్యవహారంలో డ్యాన్స్‌ చేస్తూ గర్వపడుతున్నవారు తర్వాత పశ్చాత్తాపపడతారు. వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది బాండ్ల వల్ల తెలుస్తోంది. నేను చేసే ప్రతి పనిలో రాజకీయాలను చూడకూడదు. నేను దేశం కోసం పనిచేస్తాను. ఓట్లే ప్రామాణికమైతే ఈశాన్య రాష్ట్రాలకు అన్ని పనులు చేసి ఉండకూడదు కదా. ఇతర ప్రధానులంతా కలిసి అక్కడకు ఎన్నిసార్లు వెళ్లారో నేనొక్కడినే అంతకంటే ఎక్కువసార్లు వెళ్లాను. నేను రాజకీయ నాయకుడినైనంత మాత్రాన ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేయాలనేం లేదు. తమిళనాడులో మాకు లభించే ఓట్లు డీఎంకేకు వ్యతిరేకమైనవి కాదు.. అవి భాజపా అనుకూలమైనవి. తమిళ ఓటర్లు ఈసారి మాకు పట్టం కడతారు’’ అని మోదీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని