రానున్నది హరిత వాహన యుగం: గడ్కరీ

దేశంలోని 36 కోట్ల పెట్రోలు, డీజిల్‌ వాహనాలకు మొత్తంగా మంగళం పాడతానని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిన పూనారు.

Updated : 02 Apr 2024 06:10 IST

నాగపుర్‌: దేశంలోని 36 కోట్ల పెట్రోలు, డీజిల్‌ వాహనాలకు మొత్తంగా మంగళం పాడతానని కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతిన పూనారు. అయితే, దీనికి గడువేమీ ప్రకటించలేదు. హైబ్రిడ్‌ వాహనాలకు జీఎస్టీని తగ్గించేసి హరిత ఆర్థిక వ్యవస్థను సాధిస్తానని పేర్కొన్నారు. హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీని 5 శాతానికి, ఫ్లెక్స్‌ ఇంజన్లపై 12 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించానని, అది కేంద్ర ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందన్నారు. డీజిల్‌, పెట్రోలు వాహనాలను వదిలించుకోవడం కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదన్నారు. భారతదేశం ఏటా రూ.16 లక్షల కోట్లను ఇంధన దిగుమతులపై వెచ్చిస్తోందని, హరిత ఆర్థిక వ్యవస్థకు మారితే ఈ ధనాన్ని రైతులు, గ్రామాలను సుసంపన్నం చేయడానికి, యువతకు ఉపాధి కల్పించడానికి ఖర్చు చేయవచ్చన్నారు. 2004 నుంచి తాను ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం కోసం ఎలుగెత్తి చాటుతున్నానని గడ్కరీ చెప్పారు. అప్పటి నుంచి ఈ 20 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. తాను స్వయంగా హైడ్రోజెన్‌ కారులో తిరుగుతున్నాననీ, నేడు అనేకమంది విద్యుత్‌ కార్లకు మారారని గుర్తుచేశారు.

ప్రస్తుతం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తిచేసే కరెంటును విద్యుత్‌ వాహనాలను నడపడానికి ఉపయోగిస్తున్నామని, దీనికి స్వస్తిచెప్పి పూర్తిగా పునరుత్పాదక ఇంధనాలకు మారాలని గ్రీన్‌ పీస్‌ ఉద్యమకారుడు అవినాశ్‌ చంచల్‌ పిలుపు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని