ప్రామాణిక కార్యాచరణను వెల్లడించలేం

ఎన్నికల బాండ్ల విక్రయం, సొమ్ము చేసుకోవడానికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) వెల్లడించలేమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది.

Published : 03 Apr 2024 04:41 IST

ఎన్నికల బాండ్ల విక్రయం, సొమ్ము చేసుకోవడంపై ఎస్‌బీఐ స్పష్టీకరణ

దిల్లీ: ఎన్నికల బాండ్ల విక్రయం, సొమ్ము చేసుకోవడానికి సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) వెల్లడించలేమని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. ‘అది మా అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుంది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు, మేధోపరమైన సంపదకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించకుండా చట్టంలో మినహాయింపులు ఉన్నాయి’ అని పేర్కొంది. ఎన్నికల బాండ్ల విక్రయాలు, సొమ్ము చేసుకోవడానికి సంబంధించి తమ అధీకృత శాఖలకు ఎస్‌బీఐ జారీ చేసిన ఎస్‌వోపీ వివరాలను చెప్పాలంటూ సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్‌ సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై ఎస్‌బీఐ సమాధానమిచ్చింది. దీనిపై అంజలీ భరద్వాజ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు.. వాటికి సంబంధించిన అన్ని వివరాలనూ బయటపెట్టాలని ఆదేశించింది. అయినప్పటికీ ఎస్‌బీఐ కీలక సమాచారాన్ని పంచుకునేందుకు నిరాకరిస్తోంది’ అని ఆరోపించారు. ఈ ఎస్‌వోపీతో ఎన్నికల బాండ్ల విక్రయం, సొమ్ము చేసుకోవడంపై బ్యాంకు ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందన్న వివరాలు బయటికొస్తాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని