వీవీప్యాట్‌ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది.

Published : 19 Apr 2024 05:16 IST

ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన సుప్రీంకోర్టు
సాధ్యం కాదన్న ఈసీ
ఈవీఎంలలోని ఓట్లతో స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై తీర్పు రిజర్వు

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారానికి, ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతున్న వివరాలకు పొంతన కుదరడంలేదని పేర్కొంది. ఈ అంతరాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలలో (ఈవీఎం) నమోదైన ఓట్లను... వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం గురించి ఆరా తీసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్‌కు ముందు వాటి తనిఖీ, ఆ తర్వాత సీల్‌చేసి స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కోర్టుకు హాజరైన సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీతీశ్‌ కుమార్‌ వ్యాస్‌ ధర్మాసనానికి వివరించారు.

‘ఓటింగ్‌ తర్వాత ఓటరుకు వీవీప్యాట్‌ నుంచి వచ్చే స్లిప్పు అందజేయడం సాధ్యమవుతుందా?’ అని ధర్మాసనం ప్రశ్నించగా...అలా ఇవ్వడం వల్ల రహస్య ఓటింగ్‌ విధాన లక్ష్యం దెబ్బతింటుందని, పోలింగ్‌ కేంద్రం వెలుపలకు వెళ్లాక అది ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఊహించలేమని ఎన్నికల అధికారి తెలిపారు. ‘వీవీప్యాట్‌ బాక్సులో నిక్షిప్తమైన స్లిప్పులు అన్నింటిని లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది. యంత్రాల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదు’ అని ధర్మాసనం ఆరా తీసింది. వీవీప్యాట్ల స్లిప్పులు పలుచటి కాగితంతో, అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటరు విశ్వాసాన్ని పాదుకొల్పేలా చేయాల్సిన అవసరం ఉందని, సందేహాలకు తావివ్వరాదని ధర్మాసనం తెలిపింది. అయితే, పిటిషనర్లు కోరుతున్న బ్యాలెట్‌ విధానానికి మళ్లడం అనేది తిరోగమన సూచనే అవుతుందని ఈసీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎం విధానాన్ని త్యజించాయని ఓ పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సంతోష్‌ పాల్‌ తెలుపగా....విదేశాలన్నీ భారత్‌కన్నా ఆధునికంగా ఉన్నాయని భావించరాదంటూ ధర్మాసనం చురకలు వేసింది. ఎన్నికల సంఘం చెబుతున్న సాంకేతిక అంశాలన్నింటినీ అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ ఆ సంస్థ ఇస్తున్న వివరణ ఓటరును సంతృప్తిపరిచేలా ఉందా లేదా అనేది గుర్తించాలని, మంచి ప్రయత్నం ఉంటే హర్షించాలని పిటిషనర్లకు సూచించింది. ఈవీఎంపై చిహ్నాన్ని వేలితో నొక్కిన తర్వాత వీవీప్యాట్ల వద్ద ఓటును సరిచూసుకునే సమయంలో లైటు ఎప్పుడూ వెలిగేలా ఉండాలని, ఏడు సెకన్లపాటు మాత్రమే స్లిప్పు కనిపిస్తుంది కనుక అనుమానానికి తావులేకుండా చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌ సూచించారు.

వీవీప్యాట్‌ నుంచి బయటకు వచ్చే స్లిప్పును ఓటరు తన చేతిలోకి తీసుకుని, ఓటు సక్రమంగానే నమోదైందని గుర్తించాక తానే అక్కడి బాక్సులో వేసే ఏర్పాటు ఉండాలని మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది నిజాం పాషా తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.


‘కాసర్‌గోడ్‌ మాక్‌పోల్‌’పై ఈసీ వివరణ

ఈవీఎంల నిర్వహణపై సందేహాలను వ్యక్తంచేసిన ఏడీఆర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌....కేరళలో జరిగిన మాక్‌పోల్‌ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ‘కాసర్‌గోడ్‌లో మాక్‌ పోలింగ్‌కు వినియోగించిన ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోల్చగా భాజపాకు అదనంగా ఓట్లు వచ్చాయి’ అని తెలిపారు. మాక్‌ పోలింగ్‌ ఫలితాలపై వచ్చిన ఆరోపణలను డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నీతీశ్‌ కుమార్‌ వ్యాస్‌ తోసిపుచ్చారు. మాక్‌ పోలింగ్‌ తర్వాత నాలుగు ఈవీఎంలు అదనంగా ఒక్కో స్లిప్పును ముద్రించాయన్నారు. అంతకుముందు వాటిని తనిఖీ చేసిన ఇంజినీర్లు స్లిప్పుల ముద్రణ పూర్తి కాకముందే ఈవీఎంలను ఆన్‌ చేయడం వల్ల మిగిలిన స్లిప్పులు ప్రింటయ్యాయని అందువల్ల అదనపు ఓట్లుగా కనిపించాయని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించామని, దీనికి వారు సంతృప్తి చెందారని వివరించారు. ఆ తర్వాత వెయ్యి ఓట్లు వేసి సరిచూడగా సవ్యంగానే ఉన్నట్లు తేలిందన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని