శరద్‌ పవార్‌ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్‌!

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్‌ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది.

Updated : 20 Apr 2024 08:03 IST

మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది

పుణె: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్‌ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. విలేకరి ఒకరు దానిని విసరగా...శరద్‌ పవార్‌ వెంట ఉన్న భద్రతాధికారి కొన్ని క్షణాల పాటు అతని వైపు ఆగ్రహంగా చూశారు. అయితే, ఆ పరికరం పవార్‌ను తాకక ముందే భద్రతా సిబ్బంది దానిని అడ్డుకున్నారు. బారామతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిలోకి వచ్చింది. బారామతి లోక్‌సభ స్థానంలో ఎన్సీపీ (ఎస్‌పీ) తరఫున శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే బరిలో ఉన్నారు. ఆమెకు పోటీగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ పోటీ చేస్తున్నారు. మైక్రోఫోన్‌ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు....స్థానిక విలేకరికి ఎలాంటి దురుద్దేశాలు లేవంటూ క్లీన్‌చిట్‌ ఇచ్చారు. శరద్‌ పవార్‌ ఉపన్యాసాన్ని మరింత స్పష్టంగా రికార్డు చేయడం కోసం మైక్రోఫోన్‌ను ముందుకు విసిరాడని, దానికి బదులుగా ముందున్న వ్యక్తులకు ఆ పరికరాన్ని అందజేసి వేదిక సమీపంలో ఉంచాలని సూచించాల్సిందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని