వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్‌ రీడర్‌

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.

Published : 22 Apr 2024 04:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పశ్చిమబెంగాల్‌ దూరదర్శన్‌ ఛానల్‌లో వేడి గాలులకు సంబంధించిన వార్తలు చదువుతోన్న మహిళా న్యూస్‌ రీడర్‌ లోపాముద్ర సిన్హాకు ఊహించని పరిణామం ఎదురైంది. వాతావరణ సమాచారం అందిస్తోన్న సమయంలోనే ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. బీపీ తగ్గడంతోనే పడిపోయినట్లు తన పరిస్థితి గురించి తెలుపుతూ లోపాముద్ర సోషల్‌ మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘‘ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కాకముందే నాకు అసౌకర్యంగా అనిపించింది. కాస్త కుదుటపడిన అనంతరం ప్రసారం మొదలైంది. వార్తలు చదువుతుండడంతో చాలా సేపు నీరు తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా నా కళ్లలో చీకట్లు అలుముకున్నాయి. ఆ తర్వాత ఆకస్మికంగా పడిపోయా’’ అని వివరించారు. పశ్చిమబెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని