ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే

రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు.

Published : 25 Apr 2024 05:42 IST

రాజకీయ పార్టీలు, కార్పొరేట్ల మధ్య ‘నీకిది నాకది’ తరహా అక్రమాలకు మార్గం వేసింది
కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు జరిపించాలి
సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు

దిల్లీ: రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. ఈ పథకం వల్ల జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్‌ సంస్థలు, దేశంలోని ప్రముఖ దర్యాప్తు సంస్థలు...నీకిది నాకది(క్విడ్‌ ప్రొ క్వో) తరహాలో అక్రమాలకు పాల్పడడానికి ఈ పథకం ఓ వాహకంగా ఉపయోగపడిందని పిటిషనర్లు ఆరోపించారు. కామన్‌ కాజ్‌, సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనే సంస్థలు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ద్వారా ఈ పిటిషన్‌ వేశాయి. వివిధ రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి డొల్ల కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలకు నిధులు ఎలా వచ్చాయో తేల్చేలా దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో నగదు చేతులు మారిన్నట్లు ఆధారాలు లేకున్నా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించారని గుర్తు చేశాయి. ఎన్నికల బాండ్ల పథకం కేసులో ‘నీకిది నాకది’ తరహాలో రూ.వేల కోట్ల సొమ్ము చేతులు మారిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నందున కుంభకోణాన్ని ఛేదించడానికి ప్రత్యేక దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. సంస్థ ఏర్పాటైన మూడేళ్లలోగానే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాల అధికారులు సోదాలు, దాడులు చేయడం...ఆ వెంటనే రూ.వేల కోట్ల విరాళాలు రాజకీయ పార్టీలకు చేరడం, ఆయా కంపెనీలపై దర్యాప్తులు, సోదాలు ఆగిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని పిటిషన్‌లో తెలిపాయి. లైసెన్సులు, కాంట్రాక్టులు, లీజులు, అనుమతులు పొందడానికి అధికారంలో ఉన్న పార్టీకి భారీగా నిధులు ఇచ్చినట్లు ఎన్నికల బాండ్ల డేటా స్పష్టం చేస్తుందని పేర్కొన్నాయి. డొల్ల కంపెనీల ఆవిర్భవానికి, తద్వారా అక్రమ మార్గాల్లో డబ్బు చలామణికి ఎన్నికల బాండ్ల పథకం దారి చూపిందనే సందేహాలూ కలుగుతున్నాయని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 15న ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని