అన్నం పెట్టడం లేదు.. ఇంటి నుంచి గెంటేశారు

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్‌ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్‌ (62) వాపోయారు.

Published : 20 May 2024 04:34 IST

భార్య, కుమారుడిపై రాజస్థాన్‌ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్‌ ఆరోపణ
భరణం ఇప్పించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్‌

జైపుర్‌: రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ రాజకుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. తన భార్య, మాజీ ఎంపీ దివ్యా సింగ్, తనయుడు అనిరుధ్‌ తనని వేధిస్తున్నారంటూ మాజీ రాష్ట్ర మంత్రి విశ్వేంద్ర సింగ్‌ (62) వాపోయారు. తనపై దాడి చేశారని, సరైన తిండి కూడా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మోతీ మహల్‌ నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. ఒక్క జత దుస్తులతో ఉంటున్నా. హృద్రోగ సమస్య ఉంది. సంచారిగా జీవిస్తున్నా. ఓసారి ప్రభుత్వ వసతి గృహంలో, కొన్నిసార్లు హోటల్లో ఉండాల్సి వస్తోంది. భరత్‌పుర్‌కు వస్తే ఇంట్లోకి అనుమతించడం లేదు. భార్య, కుమారుడు కలిసి నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఆ తర్వాత ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చని భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని పేర్కొంటూ స్థానిక సబ్‌-డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. తనకు నెలకు రూ.5 లక్షల భరణంతోపాటు మోతీ మహల్‌ను తిరిగి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. విశ్వేంద్ర ఆరోపణలను తోసిపుచ్చిన భార్య దివ్యా సింగ్, కుమారుడు అనిరుధ్‌.. ఈ వ్యవహారంలో తామే అసలైన బాధితులమని పేర్కొన్నారు. వారసత్వ ఆస్తులను విశ్వేంద్రసింగ్‌ విక్రయించేస్తున్నారని, తమ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని