బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్‌ను వ్యాసం రాయమన్న కోర్టు

దురుసు డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్‌కు పుణె కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

Updated : 21 May 2024 05:55 IST

పుణె: దురుసు డ్రైవింగ్‌తో ఇద్దరి మృతికి కారణమైన ఓ మైనర్‌కు పుణె కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ కింద విధించిన షరతులు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పుణెలో ఆదివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ అని తేలింది. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఆ బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని, భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్‌ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొందని, తమ అభ్యర్థనను పరిగణించాల్సిందిగా సెషన్‌ కోర్టును ఆశ్రయిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని