తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్‌ కోర్టు తీర్పు

తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్‌ జడ్జి మాయా విశ్వలాల్‌ తీర్పు వెలువరించారు.

Published : 22 May 2024 06:21 IST

ఇందౌర్‌: తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ అదనపు ప్రిన్సిపల్‌ జడ్జి మాయా విశ్వలాల్‌ తీర్పు వెలువరించారు. 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్‌ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కూమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేసిన పిటిషనర్‌ భర్త 2001లో మరణించారు. ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించింది. ఆమెతో వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయించేలా చేసింది. తండ్రి భవిష్య నిధి ఖాతాలోని డబ్బునూ తీసుకుంది. 2020 మార్చిలో కొవిడ్‌ వల్ల ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు తల్లిని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి తరిమేసింది. కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు ఆదాయం ఆర్జిస్తోందని పిటిషన్‌లో వృద్ధురాలు పేర్కొంది. దాంతో తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని కోర్టు తేల్చింది. వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని