‘డీప్‌ఫేక్‌’ ఫొటోలను గుర్తించండిలా..

సాంకేతికత అనే కత్తికి రెండువైపులా పదునే. మనం ఎలా వినియోగించుకున్నామనే దానిపైనే మంచీ చెడూ ఆధారపడి ఉంటాయి. ఈ సాంకేతిక యుగంలో మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో కృత్రిమ మేధ ఒకటి. అయితే, నాణేనికి మరోవైపులా అది అంతే ప్రమాదకరమైంది కూడా..!

Updated : 22 May 2024 09:00 IST

పలు సూచనలతో వీడియో విడుదల చేసిన కేంద్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత అనే కత్తికి రెండువైపులా పదునే. మనం ఎలా వినియోగించుకున్నామనే దానిపైనే మంచీ చెడూ ఆధారపడి ఉంటాయి. ఈ సాంకేతిక యుగంలో మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో కృత్రిమ మేధ ఒకటి. అయితే, నాణేనికి మరోవైపులా అది అంతే ప్రమాదకరమైంది కూడా..! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో అనేక ప్రయోజనాలున్నా.. కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ ఫొటోలు మానవాళిగా ముప్పుగా పరిణమిస్తున్నాయి. మన దేశంలోనూ ఈ డీప్‌ఫేక్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. అయితే, ఇలాంటి నకిలీలను గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

 ఎలాంటి టెక్నాలజీ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న మెలకువలతో ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్‌ ఫొటోలను గుర్తించొచ్చని పీఐబీ చెబుతోంది. జాగ్రత్తగా పరిశీలిస్తే.. వాస్తవ దూరంగా ఉండే చిత్రాలు, వింత వింత లైటింగ్, నీడలు, చిత్రాల్లో అసమానతలు తదితరాల్లో తేడాలను గుర్తించవచ్చంది. ఆ వీడియోలో పైన పేర్కొన్న ఒక్కో అంశాన్ని సోదాహరణంగా వివరించింది. ఉదాహరణకు.. ఏఐతో సృష్టించిన ఫొటోలో మనుషుల శరీర తీరు వాస్తవానికి విరుద్ధంగా ఉంటుంది. లేదా చేతి, కాలి వేళ్లు అసహజంగా కన్పిస్తాయని వీడియోలో పేర్కొంది. ఇక ఎడిట్‌ చేసే ఫొటోల్లో నీడలు కాస్త తేడాగా ఉంటాయని తెలిపింది. వీటన్నింటినీ పరిశీలిస్తే ఏది వాస్తవమో, ఏది నకిలీనో కనిపెట్టొచ్చని సూచించింది. ఇటీవల కొందరు సినీతారల డీప్‌ఫేక్‌ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. అటువంటి వాటిని అడ్డుకునేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనిపై చట్టం తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని