బహిరంగ దూషణలకే వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది: అలహాబాద్‌ హైకోర్టు

ఒక వ్యక్తిని బహిరంగంగా బెదిరించడం లేదా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశం కాకపోతే సదరు చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని తెలిపింది.

Published : 23 May 2024 05:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక వ్యక్తిని బహిరంగంగా బెదిరించడం లేదా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశం కాకపోతే సదరు చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని తెలిపింది. ఇంట్లోకి ప్రవేశించి కులపరమైన వ్యాఖ్యలు చేశారంటూ తనపై నమోదైన కేసును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన పింటూ సింగ్‌ అలియాస్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ తన ఇంట్లోకి ప్రవేశించి కులపరంగా దూషిస్తూ కొట్టారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) కింద కేసు నమోదైంది. దీనిని సవాల్‌ చేస్తూ నిందితుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఘటన ఫిర్యాదుదారుడి ఇంట్లోనే జరిగిందనీ, ఆ చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఆర్‌) ప్రకారం అసలు నేరం జరిగినట్టే కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలూ విన్న అనంతరం ఘటన బహిరంగంగా జరగలేదనీ, అటువంటి సందర్భాల్లో ఎట్రాసిటీ చట్టంలోని నిబంధనలు వర్తించవని జస్టిస్‌ విక్రమ్‌ డి చౌహాన్‌ తీర్పు వెలువరించారు. ప్రైవేటుగా చేసిన వ్యాఖ్యలతో ఓ వ్యక్తిపై చర్యలు తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని