46 శాతం ఎంపీలపై క్రిమినల్‌ కేసులు

లోక్‌సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు.

Published : 07 Jun 2024 05:14 IST

93 శాతం మంది కోట్లకు పడగలెత్తినవారు
మొదటి రెండు స్థానాల్లో తెలుగువారే
105 మంది విద్యార్హత 5-12వ తరగతే
కొత్త ఎంపీలపై ఏడీఆర్‌ నివేదిక

దిల్లీ: లోక్‌సభకు ఎన్నికైన 543 మంది నూతన ఎంపీల్లో 251 (46 శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 27 మంది దోషులుగా తేలినవారున్నారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు దిగువ సభ సభ్యులుగా ఉండటం ఈ దఫానే ఎక్కువని ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’ (ఏడీఆర్‌) నివేదిక వెల్లడించింది. అలాగే ఈసారి 18వ లోక్‌సభకు భారీ సంఖ్యలో ధనవంతులు ఎన్నికయ్యారని, మొత్తం ఎంపీల్లో 504 (93 శాతం) మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. సంపదపరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఎంపీల్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. గుంటూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తెదేపా నేత చంద్రశేఖర్‌ పెమ్మసాని ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ఉంది. తెలంగాణలోని చేవెళ్ల నుంచి విజయం సాధించిన భాజపా నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తుల మొత్తాన్ని రూ.4,568 కోట్లుగా పేర్కొన్నారు. మూడో స్థానంలో ఉన్న నవీన్‌ జిందాల్‌.. రూ.1,241 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌లో ప్రకటించారు. ఆయన హరియాణాలోని కురుక్షేత్ర నుంచి గెలుపొందారు. గెలుపొందిన వారిలో 105 మంది తమ విద్యార్హతను 5, 12వ తరగతుల మధ్య అని పేర్కొనగా, మరో 420 మంది గ్రాడ్యుయేషన్‌ లేదా అంతకన్నా పై చదువులు అభ్యసించినట్లు తెలిపారని ఏడీఆర్‌ వెల్లడించింది. 


నివేదికలోని మరిన్ని వివరాలు..

  • 233 (43 శాతం) మంది ఎంపీలు తమపై క్రిమినల్‌ కేసులున్నాయని ప్రకటించారు. 
  • ఈ దఫా ఎన్నికైన వారిలో 170 (31 శాతం) మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై అకృత్యాల వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయి. 
  • 2014 లోక్‌సభలో 185 (34 శాతం) మంది, 2009లో 162 (30 శాతం) మంది, 2004లో 125 (23 శాతం) మంది ఎంపీలపై నేరాభియోగాలు ఉన్నాయి. 
  • 2009తో పోలిస్తే క్రిమినల్‌ కేసులను వెల్లడించిన వారి సంఖ్య 2024లో ఏకంగా 50 శాతం పెరిగింది. 
  • 2019లో 475 మంది మిలియనీర్లు ఉండగా.. 2014లో ఆ సంఖ్య 443గా ఉంది. 2009 నుంచి మిలియనీర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అప్పుడు 58 శాతం (315) మంది సంపన్నులు ఎన్నికయ్యారు. 
  • భాజపా నుంచి గెలుపొందిన 240 మంది ఎంపీల్లో 227 మంది అంటే 95 శాతం మంది ఆస్తిపరులే. 
  • 99 మంది కాంగ్రెస్‌ ఎంపీల్లో 92 మందితో పాటు మిగతా పార్టీల్లో కూడా ఎన్నికైన అభ్యర్థుల్లో 90 శాతానికి పైగా ధనవంతులే ఉన్నారు. ఆప్‌(3), జేడీయూ(12), తెదేపా(16) నుంచి విజయం సాధించిన వారంతా మిలియనీర్లే కావడం గమనార్హం.
  • 42శాతం మంది ఎంపీలకు రూ.10 కోట్లు లేదా అంతకుమించిన ఆస్తులున్నాయి. 19 శాతం మందికి రూ.5 నుంచి రూ.10 కోట్ల మధ్య సంపద ఉంది. 32 శాతం మందికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య, ఒక శాతం మందికి రూ.20 లక్షల లోపు ఆస్తులున్నాయి. అభ్యర్థుల ఆర్థిక నేపథ్యాల ఆధారంగా గెలుపు అవకాశాలను ఏడీఆర్‌ నివేదిక విశ్లేషించింది.  
  • కొత్త లోక్‌సభలో 41 పార్టీల అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. గత లోక్‌సభలో 36 పార్టీల నుంచే సభ్యులున్నారు. 
  • జాతీయ పార్టీలకు 346 (64) స్థానాలు దక్కగా, రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు 179 (33 శాతం) సీట్లు లభించాయి. 
  • గుర్తింపు పొందని పార్టీల నుంచి 11 మంది, స్వతంత్రులుగా ఏడుగురు ఎంపీలుగా గెలిచారు.  
  • నీ 2009 నుంచి 2024 నాటికి రాజకీయ పార్టీ సంఖ్య 368 నుంచి 751 (104 శాతం) వరకూ పెరిగింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని