మూడేళ్లలో 8 కిలోమీటర్ల మేర తగ్గిన వందేభారత్‌ రైళ్ల వేగం

వందే భారత్‌ రైళ్లు 2020-21లో సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా.. ప్రస్తుతం గంటకు 76.25 కిలోమీటర్ల సగటు వేగంతో మాత్రమే నడుస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

Published : 08 Jun 2024 06:06 IST

దిల్లీ: వందే భారత్‌ రైళ్లు 2020-21లో సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా.. ప్రస్తుతం గంటకు 76.25 కిలోమీటర్ల సగటు వేగంతో మాత్రమే నడుస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 2022-23లో ఈ వేగం 81.38గా ఉండేదని వెల్లడించింది. భౌగోళిక కారణాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ రైళ్లు నియంత్రించిన వేగంలోనే ప్రయాణిస్తున్నాయని పేర్కొంది. వర్షకాలంలో అన్ని రైళ్లను 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడపడం సవాలుతో కూడుకున్న విషయమని వివరించింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు రైల్వేమంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ ఈ దరఖాస్తు దాఖలు చేశారు. వందేభారత్‌ రైళ్లు గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నా..దాని వేగం ట్రాక్‌ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దిల్లీ-ఆగ్రా మధ్య ఉన్న కొన్ని ట్రాక్‌లపై గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని వెల్లడించారు. మరికొన్ని ట్రాక్‌లపై రైలు వేగం చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దేహ్రాదూన్‌-ఆనంద్‌ విహార్‌ ట్రాక్‌పై 63.42, పట్నా-రాంచీ 62.9, కోయంబత్తూర్‌-బెంగళూర్‌ ట్రాక్‌పై 58.11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని