దిల్లీలో మేఘమథనం.. అయినా వాన జాడలేదన్న వాతావరణ విభాగం

Eenadu icon
By National News Desk Updated : 29 Oct 2025 06:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు 53 ఏళ్ల తర్వాత తొలిసారి కృత్రిమ వర్షం కోసం స్థానిక ప్రభుత్వం మంగళవారం ప్రయత్నించింది. అయితే నగరంలో ఎక్కడా వర్షపాతం నమోదుకాలేదని వాతావరణ విభాగం తెలిపింది. దిల్లీ ప్రభుత్వం మాత్రం రెండు చోట్ల చిరుజల్లులు పడ్డాయని, మేఘమథనం నిర్వహించిన చోట్ల గాల్లో కాలుష్యకారక రేణువులు తగ్గాయని ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఐఐటీ కాన్పుర్‌ సాయంతో మేఘమథనం ప్రక్రియను దిల్లీ ప్రభుత్వం నిర్వహించింది. మంగళవారం రెండు విడతల్లో ఇది సాగింది. ఇందులో భాగంగా ప్రత్యేక సెస్నా విమానం ద్వారా సిల్వర్‌ అయోడైడ్, సోడియం క్లోరైడ్, బాణసంచా పదార్థాలతో రూపొందించిన మిశ్రమాన్ని జ్వాలల ద్వారా మేఘాల్లోకి విడుదల చేశారు. తొలుత ఈ లోహ విహంగం కాన్పుర్‌ నుంచి బయల్దేరి దిల్లీలోని బురారి, ఉత్తర కరోల్‌ బాగ్, మయూర్‌ విహార్‌ వంటి ప్రాంతాలపై సంచరించింది. ఈ క్రమంలో ఒక్కొక్కటి 2 నుంచి రెండున్నర కిలోల బరువున్న 8 ప్యాకెట్లను మండించడం ద్వారా సంబంధిత రసాయనాలను మేఘాల్లోకి విడుదల చేసింది. ఇది మధ్యాహ్నం 2 గంటలకల్లా పూర్తయింది. సాయంత్రం 4 గంటల సమయంలో మేరఠ్‌ నుంచి రెండోసారి విమానం బయల్దేరింది. అది దిల్లీ శివార్లలోని బద్లీ వంటి ప్రాంతాల్లో మేఘమథనం నిర్వహించింది. ఈ విడతలోనూ 8 రసాయన ప్యాకెట్లను మండించింది. అయితే మంగళవారం మేఘాల్లో తేమ 15 నుంచి 20 శాతం మాత్రమే ఉందని, అందువల్ల ఈ ప్రయోగం ద్వారా వర్షం కురిసినా అది చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండబోదని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్‌ సింగ్‌ సిర్సా మొదట్లో తెలిపారు. ప్రయోగం జరిగిన 15 నిమిషాల నుంచి 24 గంటల్లోగా వర్షం పడొచ్చన్నారు.  మేఘమథనం నిర్వహించిన ప్రదేశాల్లో గాల్లో హానికర రేణువులు తగ్గాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4 గంటల సమయంలో నొయిడాలో 0.1 మిల్లీమీటర్లు, గ్రేటర్‌ నోయిడాలో 0.2 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసిందని పేర్కొంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం దిల్లీలో గాలి నాణ్యత స్వల్పంగా మెరుగుపడింది. రానున్న కొద్దిరోజుల్లో 9-10 సార్లు మేఘమథనం చేపడతామని ప్రభుత్వం తెలిపింది.

Tags :
Published : 29 Oct 2025 06:09 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు