Arvind Kejriwal: తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌కు ముప్పు.. హైఅలర్ట్‌లో గార్డ్స్‌..!

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు తోటి ఖైదీల నుంచి హాని జరగవచ్చనే సమాచారం అందడంతో గార్డ్స్‌ను హైఅలర్ట్‌లో ఉంచారు.

Updated : 03 Apr 2024 10:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు తిహాడ్‌ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. అదే కారాగారంలో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్‌ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహాడ్‌లోని జైల్‌ నంబర్‌-2లో కేజ్రీవాల్‌ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి. 2021లో శ్రీకాంత్‌ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్‌ వార్‌లో చంపేశారు. దిల్లీలోని వసంత్‌ విహార్‌ వద్ద 2015లో జరిగిన ఓ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు. సహ ఖైదీలు అతడిని బ్యాట్లతో తీవ్రంగా కొట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన  తనిఖీల్లో 33 మొబైల్‌ ఫోన్లు బయటపడ్డాయి.

ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తిహాడ్‌ జైల్లోని ఖలిస్థానీలు దాడి చేస్తారని వాటిల్లో హెచ్చరించాడు. ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

బరువు తగ్గిన దిల్లీ సీఎం

మార్చి 21న జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్‌ దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 50 కంటే దిగువకు చేరాయి. దీంతో చికిత్స చేసి వాటిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని జైలు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భోజనం ఇంటి నుంచే వెళుతోంది. ఏదైనా అత్యవసరమైతే తక్షణమే స్పందించేందుకు కేజ్రీవాల్‌ గదికి అత్యంత సమీపంలోనే క్విక్‌రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు.

కేజ్రీవాల్‌ మంగళవారం తిహాడ్‌ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా తన భార్య సునీతతో మాట్లాడారు. మధ్యాహ్నం మూడు గంటలకు తన న్యాయవాదితో కొన్ని నిమిషాలపాటు భేటీ అయ్యారు. కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు