Supreme Court: ఇలాగైతే ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో వేస్తారు? సుప్రీం ఆగ్రహం

Supreme Court: ‘యూట్యూబ్‌లో విమర్శలు చేసే ప్రతీ వ్యక్తినీ అరెస్టు చేసుకుంటూ పోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు?’ అంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 08 Apr 2024 14:30 IST

దిల్లీ: తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin)పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.

సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్‌ దురై మురుగన్‌ను 2021 అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడికి బెయిల్‌ మంజూరైంది. అయితే, న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అతడి బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో మురుగన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్‌ లభించింది. అప్పటినుంచి అతడు బయటే ఉన్నాడు.

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

ఈ క్రమంలోనే రెగ్యులర్‌ బెయిల్‌ రద్దును సవాల్‌ చేస్తూ యూట్యూబర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘యూట్యూబ్‌లో విమర్శలు చేసిన ప్రతిఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు?’ అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలిపింది. అందువల్ల అతడి రెగ్యులర్‌ బెయిల్‌ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని