India: ‘తూర్పు లద్దాఖ్‌ వద్ద 26 గస్తీ పాయింట్లను కోల్పోయాం’

భారత్‌ 26 పెట్రోలింగ్‌పాయింట్లను బఫర్‌ జోన్లు, గస్తీ నిర్వహించకపోవడం వల్ల కోల్పోయినట్లు సీనియర్‌ పోలీసు అధికారిణి కేంద్రానికి నివేదిక సమర్పించారు. 

Updated : 25 Jan 2023 14:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌(India) తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 కోల్పోయిందని అక్కడి సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు ప్రభుత్వానికి గత వారం నివేదిక ఇచ్చారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్‌) కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్‌ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ, మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లలో 26 చోట్ల (5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి’’ అని లేహ్‌ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి అందించిన నివేదికలో వెల్లడించారు. ఈ నివేదికను ఆమె గత వారం దిల్లీలో జరిగిన పోలీస్‌ల సదస్సులో కేంద్రానికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి  అమిత్‌షా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌ కూడా పాల్గొన్నారు.

ఈ ప్రాంతాల్లో భారత్‌ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనా(china) సాకుగా చూపి.. ఆ భూభాగాలను కలిపేసుకుంటోందని ఆ నివేదికలో హెచ్చరించారు. అటువంటి ప్రాంతాల్లో బఫర్‌జోన్లను సృష్టించి సరిహద్దును  వెనక్కి నెడుతోందని దీనిలో పేర్కొన్నారు. చైనా అంగుళం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించుకొనే ఈ వ్యూహాన్ని సలామీ స్లైసింగ్‌ అంటారని నివేదిక వెల్లడించింది. ‘‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్‌ జోన్లను అవకాశంగా మలుచుకొంటోంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి.. భారత్‌ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్‌ జోన్‌లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగంగా వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్‌ జోన్‌ ఏర్పాటు పేరిట భారత్‌ను వెనక్కి నెడుతోంది’’ అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విశ్లేషించారు. 

చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్‌ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం విశేషం. డిసెంబర్‌ 9న భారత్‌-చైనా దళాలు అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో ఘర్షణపడ్డాయి. గల్వాన్‌ ఘటన తర్వాత జరిగిన పెద్ద ఘర్షణ ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని