Rajnath Singh: ‘మీకు చేతకాకపోతే చెప్పండి..’: పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ కౌంటర్‌

Rajnath Singh: ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్థాన్‌ వల్ల కాకపోతే ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. 

Published : 11 Apr 2024 14:25 IST

దిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్థాన్‌ (Pakistan)పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh) మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో దాయాది అసమర్థతను ఎద్దేవా చేశారు. అది తమకు చేతకాదని పాక్‌ భావిస్తే.. ఆ దేశానికి సహకారం అందించేందుకు తాము (India) సిద్ధంగా ఉన్నామని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తుచేసుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో మా తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు నాకు పెరోల్‌ కూడా ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వారు (కాంగ్రెస్‌) మమ్మల్ని నియంతలుగా పేర్కొంటున్నారు’’ అని రాజ్‌నాథ్‌ దుయ్యబట్టారు. కేంద్రమంత్రి పూర్తి ఇంటర్వ్యూ ఈ సాయంత్రం ప్రసారం కానుంది.

ప్రధాని దిగాలని.. విమానాన్ని దారి మళ్లించారు

ఉగ్రదాడులను ఉద్దేశిస్తూ రక్షణమంత్రి ఇటీవల పాకిస్థాన్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ‘‘దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలం. అక్కడికి వెళ్లి మరీ మట్టుపెడతాం’’ అని హెచ్చరించారు. పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక న్యూదిల్లీ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై స్పందిస్తూ రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయదని, వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదని స్పష్టంగా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని