Lok Sabha Elections: నాడు హిమాచల్‌ను వద్దనుకున్న కంగన.. పాత ట్వీట్‌ వైరల్‌

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను భాజపా ప్రకటించిన వేళ గతంలో ఆమె హిమాచల్‌ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.  

Published : 25 Mar 2024 13:10 IST

దిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను భాజపా ప్రకటించిన వేళ గతంలో ఆమె హిమాచల్‌ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.  

రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి కంగన ప్రస్తావిస్తూ ఎన్నికల్లో  పోటీ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి కాకుండా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే మరేదైనా ప్రముఖ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఉందని చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే హైకమాండ్‌ ఆదేశాల ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌లోని మండి నుంచే పోటీ చేస్తున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఇదిలా ఉండగా ఇటీవల ఆమె తన సొంత రాష్ట్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. 

‘‘నా ప్రియమైన భారత దేశ ప్రజల సొంత పార్టీ భాజపాకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. నా సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా భాజపా నా పేరు ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. అధికారికంగా భాజపాలో చేరడం గౌరవంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. భాజపా కార్యకర్తగా, విశ్వసనీయ ప్రజా సేవకురాలిగా ప్రజలకు సేవలందించేందుకు ఎదురు చూస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు.

కంగనా రనౌత్ గ్యాంగ్‌స్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో ప్రముఖ నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. వో లమ్హే, లైఫ్‌ ఇన్‌ ఎ మెట్రో, ఫ్యాషన్, తను వెడ్స్ మను, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, క్వీన్, తలైవి, తేజస్ వంటి హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్నారు. భాజపా కంగనాను మండి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని