Lokayukta: కర్ణాటక లంచం కేసు.. భాజపా ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌

లంచం (Corruption) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పకు (Virupakshappa) కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని లోకాయుక్త ఇప్పటికే అరెస్టు చేసింది.

Published : 08 Mar 2023 00:05 IST

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) భాజపా ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్త (Lokayukta) చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే మదాల్‌ విరూపాక్షప్పకు (Virupakshappa) కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. లంచం కేసులో ప్రశాంత్‌తో సహా ఐదుగురిని లోకాయుక్త అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే విరూపాక్షప్ప (Virupakshappa) తరఫునే ప్రశాంత్‌ లంచం తీసుకున్నారని లోకాయుక్త (Lokayukta) అనుమానిస్తోంది. దీంతో ఈ కేసులో ఆయన్ను ఏ1గా చేర్చింది. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే ఆచూకీ మాత్రం లభించలేదు. ఇదే సమయంలో ఈకేసులో తన పాత్ర లేదని పేర్కొంటూ  విరూపాక్షప్ప హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని మంగళవారం విచారించిన జస్టిస్‌ కే నటరాజన్‌ ఏకసభ్య ధర్మాసనం.. ఎమ్మెల్యేకు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ సందర్భంగా ఆర్డరు కాపీ అందిన 48 గంటల్లోగా విచారణ అధికారి ముందు హాజరు కావాలని విరూపాక్షప్పను హైకోర్టు ఆదేశించింది. రూ.5లక్షల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. బెయిల్‌ పొందిన నేపథ్యంలో ఎటువంటి ఆధారాలను చెడగొట్టేందుకు ప్రయత్నించవద్దని ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్‌ లోకాయుక్తకు చిక్కారు. ప్రశాంత్‌ ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరపగా.. సుమారు రూ.8కోట్లకు పైగా నగదు లభ్యమైంది. నగదుతోపాటు పెద్ద ఎత్తున భూముల పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్లతోపాటు బంగారం, వెండి కూడా గుర్తించినట్లు లోకాయుక్త వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని