Kunal Kamra: దేశ వ్యతిరేక సంస్థల నుంచి కునాల్‌కు నిధులు: శివసేన

Eenadu icon
By National News Team Published : 29 Mar 2025 16:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ (Kunal Kamra) కమ్రాపై శివసేన నేత రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశాల్లోని భారత వ్యతిరేక సంస్థల నుంచి స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ నిధులు పొందుతున్నారని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర అధికార నాయకుల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు విదేశాలలోని భారత వ్యతిరేక ఉగ్ర సంస్థలు, ఖలిస్తానీ గ్రూపులు కునాల్‌కు డబ్బులు ఇస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా ఆయనకు వచ్చిన నగదుకు సంబంధించిన 300 స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయని..వాటిని పోలీసులకు అందజేస్తానని రాహుల్‌ పేర్కొన్నారు.

నిజం తెలియాలంటే అధికారులు కునాల్‌ యూట్యూట్‌ ఖాతాను డీమోనిటైజ్ చేసి, పరిశీలించాలని డిమాండ్ చేశారు. మన దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం కొన్ని దేశాలకు నచ్చలేదని.. అందుకే కునాల్‌ వంటి కొందరికి డబ్బు ఆశచూపి ప్రజల్లో మన నాయకులను తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అతడికి సంబంధించిన ఆర్థి లావాదేవీలను నిలిపివేయాలని..వాటిని నిఘా వేయాలని డిమాండ్‌ చేశారు. కాగా శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కామెడీ షో రికార్డు చేసిన ప్రదేశం బుకింగ్‌ డబ్బు మాతోశ్రీ నుంచి, ఉద్ధవ్‌ ఠాక్రే నుంచి వచ్చిందని  శివసేన నేత సంజయ్‌ నిరుపమ్‌ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే((Eknath Shinde)పై ఇటీవల కునాల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్‌ 7వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కునాల్‌ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ  తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తాజాగా ముంబయిలో ఆయనపై మరో మూడు కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు