Kunal Kamra: శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కుణాల్ కామ్రా

Eenadu icon
By National News Team Updated : 07 Apr 2025 10:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా (Kunal Kamra) చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం నేపథ్యంలో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని ఆయన సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కును ఉల్లంఘించే విధంగా ఈ కేసులు ఉన్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఏప్రిల్ 21న విచారణ జరగనుంది.

ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్‌ హోటల్‌లో గల హాబిటాట్‌ కామెడీ స్టూడియోలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను ‘గద్దార్‌’ (ద్రోహి)గా అభివర్ణిస్తూ ‘దిల్‌తో పాగల్‌ హై’ హిందీ చిత్రంలోని ఒక సినీ గీతానికి పేరడీని కామ్రా ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా హాబిటాట్‌ స్టూడియోపై 40 మంది శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం పోలీసులు కుణాల్‌కు మూడుసార్లు సమన్లు ఇచ్చారు. విచారణకు గైర్హాజరైన ఆయన తాజాగా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. కుణాల్‌ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరగా.. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :
Published : 07 Apr 2025 10:39 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు