Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు

Mahua Moitra: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మెయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమెపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది.

Updated : 08 Dec 2023 16:01 IST

దిల్లీ: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ‘‘ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదకరంగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు’’ అని స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమెను బహిష్కరించాలని డిమాంండ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానాన్ని పెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయమివ్వాలని, నివేదికపై ఓటింగ్‌కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు.

మహువాకు అనుమతి నిరాకరణ..

ఈ క్రమంలోనే నివేదికపై కొంతసేపు చర్చించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయితే, ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. సభాపతి అందుకు నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటింగ్‌ ద్వారా.. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదించింది. అనంతరం మహువాను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్‌.. సభను వచ్చే సోమవారానికి (డిసెంబరు 11) వాయిదా వేశారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. ఓటింగ్‌ సమయంలో విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

మా ఇంటికి సీబీఐ వస్తుందేమో: మహువా

తన బహిష్కరణను మహువా తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఎథిక్స్‌ కమిటీ ప్రతి నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలను నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక, రేపు మా ఇంటికి సీబీఐని పంపించి నన్ను వేధిస్తారేమో’’ అని మహువా మండిపడ్డారు.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని