Emmanuel Macron: భారత్‌ పర్యటన అద్భుతం.. విశేషాలు పంచుకున్న మేక్రాన్‌

ఇటీవల భారత్‌లో పర్యటించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌.. గ్లింప్స్‌ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Published : 04 Feb 2024 20:42 IST

పారిస్: భారత గణతంత్ర (Indian Republicday Celebrations) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) తన పర్యటన విశేషాలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను ఆయన పోస్టు చేశారు. సందర్శించిన ప్రదేశాలు, సైనిక కవాతు, ప్రముఖులతో సమావేశాలు తదితర సందర్భాలను అందులో చూపించారు. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పారిస్‌ తహతహలాడుతోందని అన్నారు. పరివర్తన దిశగా అడుగులేస్తున్న ప్రపంచదేశాల్లో భారత్‌ ముందువరుసలో ఉందని కితాబిచ్చారు. ఈ పర్యటనతో ‘టీ’ ఓ అలవాటుగా మారిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు.

భారత్‌ 75వ గణతంత్రవేడుకలకు తనను ఆహ్వానించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు మేక్రాన్‌ చెప్పారు. కవాతులో ఫ్రాన్స్‌ కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుంటే.. పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని చెప్పారు. 2030 నాటికి భారత్‌ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించేందుకు ఫ్రాన్స్‌ సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని