Ajit Pawar: ప్రజలు మోదీనే ప్రధానిగా కోరుకుంటున్నారు: అజిత్‌ పవార్‌

మెజారిటీ ప్రజలు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆదివారం అన్నారు. 

Published : 25 Feb 2024 19:43 IST

పుణె: దేశంలోని మెజారిటీ ప్రజలు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) ఆదివారం అన్నారు. మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రతి ఒక్కరూ ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. బారామతి(Baramati)లోని రైతుల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తన స్వస్థలం నుంచి లోక్‌సభ ఎన్నికల  ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘65 శాతానికి పైగా ప్రజలు మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో నేను మరింత కష్టపడి పని చేస్తాను. లోక్‌సభలో ఎన్డీఏ 400 సీట్లు గెలవడానికి మహాయుతి(పాలక కూటమి) కలిసి పనిచేస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరూ విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పని చేయాలని సూచించారు. చీలికలు సృష్టించవద్దని,  ఏ వర్గాన్ని దెబ్బతీసేలా ప్రకటనలు చేయవద్దని ఆయన తన మద్దతుదారులను కోరారు. మనం అభివృద్ధి పథంలో పయనించాలనుకుంటే అలాంటి ఆలోచనలే ఉన్న ఎంపీని ఎన్నుకోవాలన్నారు. పాలక కూటమిలో భారతీయ జనతా పార్టీ, ఏక్‌నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన,  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భాగస్వాములుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని