Modi 3.0: ప్రధాని ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే..!

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. 

Published : 09 Jun 2024 13:56 IST

దిల్లీ: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్‌ విజయం సాధించడంతో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ (Modi) ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం నేటి సాయంత్రం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హస్తం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఖర్గే ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని కీలక నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నుంచి ఖర్గే మాత్రమే ప్రమాణస్వీకారోత్సవానికి రానున్నట్లు స్పష్టమైంది. మరోవైపు.. కూటమిలో భాగమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సమాచారం.

అందుకు రాహుల్‌ సరైన వ్యక్తి..

కాగా.. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ (CPP)గా సోనియా గాంధీ తిరిగి ఎన్నికైన విషయం తెలిసిందే. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ).. నిన్న జరిగిన సమావేశంలో రాహుల్‌ గాంధీను కోరింది. అయితే.. దీనిపై రాహుల్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘‘భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే బలమైన ప్రతిపక్షం ఎంతో అవసరం. అందుకే పార్లమెంటులో ప్రతిపక్ష నేత హోదాకు రాహుల్‌ గాంధీ సరైన వ్యక్తి. దీనిపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది’’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని