Manipur: మణిపుర్‌ సీఎం ముందస్తు భద్రత వాహన శ్రేణిపై కాల్పులు

జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్‌లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ముందస్తు భద్రత వాహన శ్రేణిపై సోమవారం కాల్పులు జరిగాయి.

Published : 11 Jun 2024 05:55 IST

ఒకరికి గాయాలు

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్‌లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ముందస్తు భద్రత వాహన శ్రేణిపై సోమవారం కాల్పులు జరిగాయి. కాంగ్‌పోక్పీ జిల్లాలోని కోట్లెన్‌ గ్రామంవద్ద ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఓ వాహన డ్రైవరు భుజానికి గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సాయుధులైన కొందరు దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. రాజధాని ఇంఫాల్‌కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలికి భద్రతా సిబ్బంది వెంటనే చేరుకున్నారు. కూంబింగ్‌ ప్రారంభించారు. దిల్లీకి వెళ్లిన బీరేన్‌ సింగ్‌ ఇటీవల ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రత వాహన శ్రేణి ఆ ప్రాంతానికి బయలుదేరిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇటీవల జిరిబామ్‌ జిల్లాలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి. 70కిపైగా ఇళ్లను తగులబెట్టడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. ఎన్నికల సమయంలో తమవద్ద నుంచి లైసెన్స్‌డ్‌ తుపాకులను జప్తు చేయడంతో ఈ ఘటన జరిగిందని, వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ స్థానికులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించాలని సీఎం బీరేన్‌ సింగ్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇంఫాల్‌ నుంచి జిరిబామ్‌కు సీఎం ముందస్తు భద్రత వాహన శ్రేణి బయల్దేరింది. దీనిపై సాయుధులైన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఖండించారు. దిల్లీ నుంచి ఇంఫాల్‌ చేరుకున్న ఆయన గాయపడ్డ డ్రైవరును పరామర్శించారు. ఇది ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని