సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద పోలీసు వాహనం మిస్సింగ్‌.. కాల్పుల ఘటనలో కీలక విషయం

Firing At Salman Khan House: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపింది తామేనంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నటుడి ఇంటి బాల్కనీలో ఖాళీ షెల్స్‌ను పోలీసులు గుర్తించారు.

Updated : 15 Apr 2024 12:24 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు (Firing) తీవ్ర కలకలం సృష్టించాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయి (Mumbai)లోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా.. కాల్పులకు సంబంధించి కీలక విషయాలు తాజాగా బయటికొస్తున్నాయి. ఇది గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) ముఠా పనేనని తెలుస్తోంది.

ఆ వాహనం ఎక్కడ..?

సాధారణంగా సల్మాన్‌ ఇంటి ముందు ఎప్పుడూ ఓ పోలీసు వాహనం నిలిపి ఉంటుంది. ఆదివారం ఉదయం కాల్పులు జరిగిన వేళ ఆ వాహనం అక్కడ లేదని దర్యాప్తులో తేలింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తుండగా.. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇది ట్రైలర్‌ మాత్రమే: బిష్ణోయ్‌ సోదరుడు

కాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పేరుతో ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ‘‘సల్మాన్‌ ఖాన్‌.. నీకు ట్రైలర్‌ మాత్రమే చూపించాం. మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదే నీకు చివరి వార్నింగ్‌’’ అని ఆ పోస్ట్‌లో హెచ్చరించినట్లుగా ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్మోల్‌పై 18 క్రిమినల్‌ కేసులున్నాయి. 2021 అక్టోబరులో జోధ్‌పుర్‌ జైలు నుంచి విడుదలైన అతడు విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లు సమాచారం. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ వాంటెడ్‌ నిందితుడిగా ఉన్నాడు.

బాల్కనీలో ఖాళీ షెల్‌..

కాల్పుల తర్వాత ఘటనాస్థలంలో ఐదు ఖాళీ షెల్స్‌, ఒక లైవ్‌ బులెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఓ ఖాళీ షెల్‌ను సల్మాన్‌ ఇంటి బాల్కనీలో గుర్తించారు. ఘటన సమయంలో నటుడు ఇంట్లోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కాల్పుల తర్వాత నిందితులు బాంద్రా వదిలి పారిపోయినట్లు సమాచారం.

నిందితులు ఉపయోగించిన బైక్‌ను సల్మాన్‌ ఇంటికి కిలోమీటరు దూరంలో స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి వారు ఆటో రిక్షాలో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గాలించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు నిందితులు ఉపయోగించిన బైక్‌ను దొంగలించడం లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఒక అనుమానితుడిని గురుగ్రామ్‌కు చెందిన విశాల్‌ రాహుల్‌గా గుర్తించారు. ఇతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోదరా దగ్గర షూటర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పలు హత్య, దొంగతనాల కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. రోహిత్‌ కూడా విదేశాలకు పారిపోయాడు. అక్కడి నుంచే తన నేర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు.

గతంలోనూ బెదిరింపులు..

సల్మాన్‌ ఖాన్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. గతేడాది మార్చిలో అతడిని బెదిరిస్తూ పంపిన ఓ ఈమెయిల్‌ తీవ్ర కలకలం రేపింది. దీని తర్వాత సల్మాన్‌ భద్రతను వై ప్లస్‌ కేటగిరీకి పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని