Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు నక్సల్స్‌ హతం

Encounter: బీజాపుర్‌ జిల్లాలో బుధవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు.

Updated : 27 Mar 2024 11:27 IST

బీజాపుర్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. బీజాపుర్‌ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చికుర్‌బత్తి- పుస్బాక అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌ బలగాలు సంయుక్తంగా యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపై నక్సల్స్‌ కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన బలగాలు ఆరుగుర్ని మట్టుబెట్టాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

బీజాపుర్‌ జిల్లా బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ స్థానానికి ఏప్రిల్‌ 19న తొలి విడతలోనే పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాంటీ-నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని