Congress: రూ.3500 కోట్ల పన్ను నోటీసులు.. కాంగ్రెస్‌కు భారీ ఊరట

Congress: పన్ను నోటీసుల్లో కాంగ్రెస్‌ పార్టీపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం సుప్రీంకోర్టుకు తెలిపింది. బకాయిలను ఇప్పుడే రికవరీ చేయబోమని వెల్లడించింది.

Updated : 01 Apr 2024 12:52 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు వరుస ఐటీ నోటీసుల (IT Notice)తో సతమతమవుతన్న కాంగ్రెస్‌ (Congress) పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు రూ.3500 కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీపై ప్రస్తుతం ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court)కు ఐటీ శాఖ తెలిపింది.

పన్ను డిమాండ్ల నోటీసులను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ రాజకీయ పార్టీ. ప్రస్తుతం దేశంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున ఆ పార్టీపై ఎలాంటి బలవంతపు చర్యలకు దిగబోం. దీనిపై తుది తీర్పు వచ్చేదాకా ముందస్తు చర్యలు చేపట్టం’’ అని తెలిపారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. తిహాడ్‌ జైలుకు సీఎం

ఇటీవల ఐటీ విభాగం కాంగ్రెస్‌కు వరుసగా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.  2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని గత శుక్రవారం నోటీసులిచ్చింది. అనంతరం 2014-15 నుంచి 2016-17 మదింపు సంవత్సరాలకు సంబంధించి మరో రూ.1744 కోట్లు కట్టాలని ఇంకో తాఖీదు పంపింది. ఈ నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ.3,567 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయపుపన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను రికవరీ చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ‘‘పన్ను ఉగ్రవాదం’’తో ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా కుంగదీయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని