Tiruvanantapuram: రేషన్‌ షాపుల్లో మోదీ పోస్టర్లు.. ఆ ఆదేశాలు సరికాదు: కేరళ సీఎం

రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

Published : 12 Feb 2024 15:36 IST

తిరువనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలుచేయడం కష్టమని కేరళ(Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్‌ దుకాణాల్లో మోదీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందా అని అడిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యే పి.అబ్దుల్‌ హమీద్‌(Abdul Hameed) ప్రశ్నకు ముఖ్యమంత్రి ఈవిధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో రేషన్‌ వ్యవస్థ ఎప్పటినుంచో ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిసిటీ పద్ధతిని అనుసరిస్తుందని స్పష్టమవుతోంది.’’ అని మండిపడ్డారు.

ఈ ఆదేశాలు సరికావని, వాటిని రాష్ట్రంలో అమలుచేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల కమిషన్‌(Election Commission of India) దృష్టికి తీసుకెళ్లాలా, లేదా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్‌ అనిల్‌(GR Anil)  మాట్లాడుతూ 14 వేలకు పైగా ప్రధాని పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ), రాష్ట్ర ఆహార శాఖకు బాధ్యత అప్పగించిందని తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్‌ దుకాణాల్లో పీఎం సెల్ఫీ పాయింట్లును ఏర్పాటుచేయాలని కేంద్రం ఆదేశించిందని, వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఎఫ్‌సీఐ  అధికారులకు సూచించామన్నారు. ఆహార పదార్థాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వ గుర్తులున్న క్యారీ బ్యాగ్‌లను సరఫరా చేయాలని చెప్పారని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం రేషన్ పంపిణీ వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని మంత్రి దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని