Amartya Sen: అందుకే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయ్‌: అమర్త్య సేన్‌

Amartya Sen: భారత్‌లో విపక్షాలు బలహీనపడడానికి కారణాలు, ఎన్డీయే సర్కార్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్య సేన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Published : 14 Apr 2024 16:07 IST

కోల్‌కతా: ఐకమత్యం లేకపోవడం వల్లే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌ (Amartya Sen) అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ (Congress) పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కులగణన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే అని అమర్త్య సేన్‌ (Amartya Sen) అన్నారు. కానీ, అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం వంటి అంశాల్లో వెనుకబడిన వారికి మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశ పౌరుడినైనందుకు చాలా గర్విస్తున్నానని తెలిపారు. కానీ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా కృషి జరగాలన్నారు.

జేడీయూ, ఆర్‌ఎల్‌డీ వంటి పార్టీలు వైదొలగటంతో విపక్ష ‘ఇండియా కూటమి’ ఆదరణ కోల్పోయిందని సేన్‌ విశ్లేషించారు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే భాజపాను (BJP) ఓడించడానికి కావాల్సిన బలం లభించి ఉండేదన్నారు. వ్యవస్థాగత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌.. తన ఘనమైన గతం నుంచి స్ఫూర్తి పొందాలని హితవు పలికారు.

భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్త్య సేన్‌ విమర్శలు గుప్పించారు. భారత్‌ అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారాయని తెలిపారు. భారత పాలకవర్గం పూర్తిగా ధనవంతుల పక్షానే నిలుస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలో మార్పులపై ప్రస్తావించగా.. దాని వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని